Kochi Coast : కొచ్చి తీరంలో లిబియా కెమికల్స్ నౌక మునక.. సముద్ర జలాల కలుషితంపై ఆందోళన

లైబీరియా నౌక ఒకటి కొచ్చి తీరంలో ప్రమాదానికి గురైంది. ఈ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం మునిగింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ప్రకటించింది. నౌకలో మొత్తం 60 కంటైనర్లు ఉండగా, వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగతా వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు పేర్కొంది. రసాయనాలు లీకైతే సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కంటైనర్లను, అందులోనుంచి బయటకొచ్చిన ఇంధనాన్ని తాకొద్దని ప్రజలకు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీచేసింది. లీకైన రసాయనాలు, ఇంధనం సముద్రంలో ఏమేరకు వ్యాపించిందనే విషయాన్ని పరిశీలించడానికి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్కు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నౌక విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరింది. శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ తీరం చేరాల్సివుంది. కాగా, నౌకలోని 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు ఐసీజీ అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com