Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు..

Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు..
Maharashtra: శివసేన వర్సెస్ ఏక్‌నాథ్‌ షిండే వర్గం.. తెరవెనుక బీజేపీ మంత్రాంగంతో మహారాష్ట్ర సమరం హీట్ పుట్టిస్తున్నాయి.

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన వర్సెస్ ఏక్‌నాథ్‌ షిండే వర్గం.. తెరవెనుక బీజేపీ మంత్రాంగంతో మహారాష్ట్ర సమరం రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలపై వేటుకు శివసేన.. అనర్హత వేటు వేసే హక్కు లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు గడప తొక్కాయి. సుప్రీంలో ఇరువురి వాదనలు ముగిసిందో లేదో.. మహారాష్ట్ర పొలిటికల్‌ గేమ్‌లోకి కమలం పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి షిండే వర్గానికి నడిపిస్తున్నారని శివసేన ఆరోపిస్తున్న వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫడ్నవీష్ రంగంలోకి దిగారు.

ముంబైలో అత్యవసరంగా బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు తమకు 172 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర నాయకత్వం.. పార్టీ ఎమ్మెల్యేలంతా ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఇన్నాళ్లూ శివసేన వర్సెస్ ఏక్‌నాథ్‌ షిండేగా సాగిన మహా హైడ్రామాలో.. ఇపుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌థాక్రే ఎంట్రీతో మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగింది. మాజీమంత్రులు నితిన్ సర్దేశాయ్, బాలానందతో రాజ్‌థాక్రే భేటీ అయ్యారు.

అంతేకాదు.. శివసేన సర్కారుపై తిరుగుబాటు చేసిన రెబల్ వర్గం నేత ఏక్‌నాథ్ షిండేతో ఆయన ఫోన్‌లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలకు ఎంఎన్ఎస్‌లో కలిసే అంశంపై రాజ్‌థాక్రే-షిండేల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే, రాజ్‌థాక్రే మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. దీంతో ఇపుడు మహారాష్ట్ర రాజకీయ, పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బాల్‌థాక్రే తమ్ముని కొడుకు అయిన రాజ్‌థాక్రే.. సీఎం ఉద్దవ్‌ థాక్రేకు సోదరుడు అవుతాడు. అయితే నాడు శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్‌థాక్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించాడు.

ఇపుడు గతాన్ని మరిచి సంక్షోభంలో సోదరులకు అండగా నిలిచి సంధి చేస్తాడా? లేక షిండే వర్గం, బీజేపీతో కలిసి శివసేనను గద్దె దింపి ప్రతీకారం తీర్చుకుంటాడా? అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడ్రోజుల్లో అన్ని పక్షాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రెండు పిటిషన్లపై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. డిప్యూటీ స్పీకర్ నోటీసులపై స్టే విధించింది.

అనర్హత పిటిషన్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు రెబల్ ఎమ్మెల్యేలకు జులై 12 వరకు సమయం ఇచ్చింది. షిండే వర్గం పిటిషన్లపై విచారణ ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా వెకెషనల్ బెంచ్.. అనర్హత విషయంలో హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. శివసేన, షిండే వర్గం వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ జులై 11కు వాయిదా వేసింది. మరి ఈ 15 రోజుల పాటు ఎలాంటి ట్విస్టులు.. పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story