Kuwait: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం, ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం

ప్రధానితో భేటీ అనంతరం కువైట్ కు కేంద్రమంత్రి

కువైట్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్‌ను ఆదేశించారు.

ఎడారి దేశం కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందినవారే. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు చెందినవారున్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, నేపాల్‌ జాతీయులున్నారు. ప్రమాదంలో మరో 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం అంతా వ్యాపించాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నంబర్‌ను ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు +965 65505246 నంబరును సంప్రదించవచ్చు.

కువైట్‌లోని మంగాఫ్‌లో ఉన్న అల్‌-మంగాఫ్‌ అనే ఆరంతస్తుల భవనాన్ని ఎన్‌బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. కార్మికులంతా నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతోపాటు పొగ దట్టంగా వ్యాపించడంతో ఊపిరాడక ఎక్కువ మంది మరణించారు. 6 గంటల సమయంలో సమాచారం అందుకుని వచ్చిన ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయని కువైట్‌ అధికారులు తెలిపారు. సహాయక చర్యల సందర్భంగా ఫైర్‌ ఫైటర్స్‌ కొందరు గాయపడ్డారు. కువైట్‌ హోంశాఖ మంత్రి షేక్‌ ఫహద్‌ అల్‌-యూసుఫ్‌ అల్‌-సబా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల సంఖ్యను ధ్రువీకరించారు. భవనం యజమానితోపాటు, ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags

Next Story