Satya Nadella: సత్య నాదెళ్లకు జరిమానా

Satya Nadella: సత్య నాదెళ్లకు జరిమానా
కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా

మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్‌ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది. కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు రూ.27.10 లక్షలు చెల్లించాలని వీరిని ఆదేశించింది. ప్రధాన లబ్ధిని పొందే యజమాని (సిగ్నిఫికెంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌) నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిపై ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల కంపెనీల రిజిస్ట్రార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై రీజనల్‌ డైరెక్టర్‌ వద్ద 60 రోజుల్లోగా అప్పీలు చేయవచ్చు.

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్‌ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్‌ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.

ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (RoC) జారీ చేసింది. లింక్డ్‌ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్‌బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్‌ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్‌ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్‌కీ నివేదించలేదని పేర్కొంది.

రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రకారం, లింక్డ్‌ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్‌ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్‌కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్‌ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్‌డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్‌ ఉన్నారు.

Tags

Next Story