Wayanad : వయనాడ్ వరదలు జాతీయ విపత్తు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక డిమాండ్

కేరళ వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనను కేవలం ఓ రాష్ట్ర సమస్యగా పరిగణించి వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని ఆయన హెచ్చరించారు.
దక్షిణాదిలో ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. 350 మందికి పైగా దుర్మరణం పాలైన వయనాడ్ విలయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని సూచించారు. అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ లో కొండచరియలు విరిగిపడటం, వర్షపు నీటితో బురద కలిసి ప్రవహించే సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందించాలని ఆయన కోరారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించి కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చే ఆరెంజ్, రెడ్ అలె ర్టులతో ప్రమాదాలను అంచనా వేయలేమని ఉపగ్రహాల చిత్రాల ద్వారా ఖచ్చితత్వంతో కూడిన హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు సూచించారు.
భూకంప ప్రాంతాలను జోన్లుగా విభజించినట్టే కొండ చరి యలు కుప్పకూలే అవకాశాలున్న ప్రదేశాలను కూడా కేటగిరీల వారిగా గుర్తించాలని ఆయన సూచించారు. రుతుపవనాల సమయంలో ఆ ప్రాంతాల్లో సహాయక బృందాలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com