Wayanad : వయనాడ్లో మోదీ ఏరియల్ సర్వే

కేరళలో ప్రధాని మోదీ పర్యటించారు. వయనాడ్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శనివారం కన్నూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వాయుసేన హెలికాప్టర్లో కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మల సహా పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించారు.
మోదీది సరైన నిర్ణయం : రాహుల్
కాగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పీఎం మోదీ పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమన్నారు. ఇప్పటికైనా వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com