Floods : రుతుపవనాల ప్రభావం.. పలు రాష్ట్రాలను వీడని వరదల భయం

దేశంలో రుతుపవనాల ప్రభావం తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాలలో మంచుకురుస్తోంది. హిమాచల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది.
పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో కొన్ని చోట్ల, తూర్పు యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్లోని టెరాయ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య బుందేల్ఖండ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్ల కు సెలవులు ప్రకటించారు.
మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్లో బాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కోసి, గండక్లు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్లకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com