Kangana Ranaut : క్షమాపణలు చెప్పిన ఎంపీ కంగనా రనౌత్

సాగు చట్టాలపై చేసిన తన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడంతో కంగన స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలనున వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. ‘నా వ్యాఖ్యలు చాలా మందిని అసంతృప్తికి గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. వాటిని వెనక్కి తీసుకుంటున్నా. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి ఉమ్మడి బాధ్యత’ అని కంగన పేర్కొన్నారు. అంతకుముందు ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇవన్నీ తన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీతో వీటికి ఎలాంటి సంబంధం లేదని పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com