NAMBALA: బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లు అజ్ఞాతంలోనే

ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం మావోలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మావోలకు వెన్నెముకగా ఉన్న సంబాల మృతిపై స్వయాన కేంద్ర హోంమంత్రే స్పందించారు. నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని జియన్నపేట. 1955లో కేశవరావు జియన్నపేటలో జన్మించారు. కేశవరావుకు ఓ సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ సీట్ రావడంతో జాయిన్ అయ్యారు. కేశవరావు బీటెక్ చదువుతుండగానే.. రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సీపీఐ పీపుల్స్వార్ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై.. ఎంటెక్ మద్యలోనే ఆపేసి ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి 43 ఏళ్లుగా కేశవరావు మావోయిస్టు రూపంలో అజ్ఞాతంలోనే ఉన్నారు.
కీలక నిర్వహకులలో ఒకరు...
1980లో ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు నంబాల కేశవరావు కీలక నిర్వాహకులలో ఒకరుగా ఉన్నారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్ అతనే. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావో సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com