Amit Shah : దేశంలో నక్సలిజం అంతం చేస్తాం : అమిత్ షా

2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం అంతం చేస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో హింసను వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి షా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారని అమిత్షా చెప్పారు. మావోయిస్టులు ఒకప్పుడు పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారని కానీ, మోదీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే మావోయిస్టుల అంతానికి ఆల్- అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని నాలుగు జిల్లాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించారన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో మావోయిస్టుల హింసాకాండ బాధితులకు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందిస్తుందన్నారు. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా బాధితులకు సహాయం అందిస్తామని షా వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com