Doctor Suicide Case: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై అత్యాచారం చేశారని.. మానసిక, శారీరిక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
వైద్యురాలు ఎక్కువగా శవపరీక్ష విధుల్లో ఉండేది. దీంతో కీలక రిపోర్టులన్నీ ఆమె చేతుల్లోనే ఉండేవి. ఈ క్రమంలో పోలీసులు, రాజకీయ నాయకులు వైద్యురాలిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పోస్ట్మార్టం రిపోర్టులను మార్పించుకునేవారు. ఇలా ఆమె మానసికంగా, శారీరికంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ మేరకు సూసైడ్లో ఆమె స్పష్టంగా ప్రస్తావించింది. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఫల్టాన్లోని రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది.
తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుమార్తె మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని తెలిపింది. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని రాజకీయ నాయకులు, పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలి రిపోర్ట్ మార్చేసిందని పేర్కొన్నారు.
భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె పేరు దీపాలి మారుతి. కుమార్తెకు సైన్యంలో అధికారిగా పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. ఫాల్టాన్లోని రౌత్ ఆస్పత్రికి వెళ్లి చూసేటప్పటికీ కుమార్తె శవమై ఉండడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తెలిపారు. అయితే దీపాలి మరణంపై భాగ్యశ్రీ అనుమానం వ్యక్తం చేసింది. ఇక పోస్ట్మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక రాలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చాక సహజ మరణంగా రిపోర్టు రావడంతో ఒక్కసారిగా భాగ్యశ్రీ ఖంగుతిన్నది.
‘‘నా కుమార్తె దీపాలి ఆత్మహత్య చేసుకోదు. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను.’’ అని భాగ్యశ్రీ అన్నారు. పోస్ట్మార్టం రిపోర్టు విషయంలో వైద్యురాలిపై పోలీసలు, రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చి మార్పించారని ఆరోపించింది. దీనిపై మళ్లీ దర్యాప్తు చేయాలని తాజాగా భాగ్యశ్రీ డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

