PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారులకు నిరాశేనా? హోలీ లోపు ఖాతాల్లోకి రెండు వేలు రావడం కష్టమే.

PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారులకు నిరాశేనా? హోలీ లోపు ఖాతాల్లోకి రెండు వేలు రావడం కష్టమే.
X

PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది కోట్ల మందికి పైగా రైతు సోదరులు ఇప్పుడు ఆశగా ఎదురుచూస్తున్న ఒకే ఒక్క విషయం.. పీఎం కిసాన్ 22వ విడత నగదు ఎప్పుడు జమ అవుతుందా అని.. గతేడాది నవంబర్ 19న 21వ విడత డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో సాయం అందలేదు. ఫిబ్రవరి నెల ముగింపుకు వచ్చింది, కానీ అన్నదాతల ఖాతాల్లో ఆ రెండు వేల రూపాయల సందడి మాత్రం కనిపించడం లేదు. నేడు ఫిబ్రవరి 28, నెలలో చివరి రోజు కావడంతో ఇవాళైనా శుభవార్త వస్తుందని చాలా మంది ఆశపడ్డారు. కానీ, నేడు నాలుగో శనివారం కావడం వల్ల బ్యాంకులు మూతపడ్డాయి. దీనివల్ల ఇవాళ డబ్బులు జమ అయ్యే అవకాశం దాదాపు లేనట్లేనని నిపుణులు చెబుతున్నారు.

రైతుల మనసులో ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే.. కనీసం హోలీ పండుగ ముందైనా ఈ డబ్బులు వస్తాయా? అని. ఒకసారి రాబోయే రోజుల క్యాలెండర్ చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. రేపు మార్చి 1 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఆ వెంటనే మార్చి 2, 3 తేదీల్లో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఇతర కారణాల వల్ల బ్యాంకులు పాక్షికంగా లేదా పూర్తిగా పనిచేయవు. ఇక మార్చి 4న హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు ఉంది. వరుసగా వస్తున్న ఈ సెలవుల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి హోలీ లోపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు చేరడం అనేది ప్రస్తుతానికి అసాధ్యంగానే కనిపిస్తోంది.

కేవలం బ్యాంకుల సెలవులు మాత్రమే కాకుండా, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా నిధులు విడుదల చేయడానికి కొన్ని రోజుల ముందే ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. కానీ, 22వ విడతకు సంబంధించి ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని అనుకున్నా, డీబీటీ ద్వారా ఈ ప్రక్రియ జరగాలి. బ్యాంకులకు వరుస సెలవులు ఉండటంతో టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఈ గ్యాప్ తర్వాతే నిధులు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రైతులు తమ 22వ విడత డబ్బుల కోసం ఎదురుచూసే లోపు ఒక ముఖ్యమైన పనిని మాత్రం మర్చిపోకూడదు. అదే ఈ-కేవైసీ. మీ ఆధార్ కార్డు అప్‌డేట్ అవ్వకపోయినా లేదా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోయినా మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి మీ స్టేటస్ చెక్ చేసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా, ఈసారి హోలీ పండుగను రైతులు సొంత జేబు నుంచే జరుపుకోవాల్సి వచ్చేలా ఉంది. పండుగ తర్వాత మార్చి రెండో వారంలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

Tags

Next Story