MODI: కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావు

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవదని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు.హస్తం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదని ఆయనఅన్నారు. కందమాల్ లోక్ సభ స్థానం పరిధిలోని ఫుల్ బానీలో..ప్రధాని ఎన్నికల ప్రచారం చేశారు. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున... నాటి ప్రధాని వాజ్ పేయీ పోఖ్రాన్ లో అణుపరీక్షలను నిర్వహించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని చెప్పారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందంటూ ప్రతిపక్షాలు సొంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. మోదీ ఆరోపించారు. అయితే.. అణుబాంబు ఎలా నిల్వ చేయాలో తెలియని దుస్థితిలో పాకిస్థాన్ ఉందన్నారు. దాన్ని అమ్ముదామని ప్రయత్నిస్తున్నా.... నాణ్యతపై సందేహాలతో ఎవరూ మందుకురావడంలేదన్నారు. ఒడిషాలో తొలిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. ఒడిశా భాష, చరిత్ర తెలిసిన పురుషుడు లేదా మహిళ భాజపా ప్రభుత్వంలో ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని మోదీ చెప్పారు.
40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్ పవర్, ఎక్నాథ్ షిండ్తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది.
శరద్ పవార్ ఆగ్రహం
కాంగ్రెస్ లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా...అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీతో కలిసిపోవాలని ప్రధాని మోదీ చేసిన సూచనను ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తిరస్కరించారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోబోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించేవారితో చేతులు కలపబోనని స్పష్టంచేశారు. మూడు విడతల పోలింగ్ తర్వాత ప్రధాని మోదీ, భాజపా నేతల్లో ఓటమి భయం కన్పిస్తోందని పవార్ విమర్శించారు. అందుకే...ప్రధాని మోదీ తన ప్రసంగంలో మతపరమైన వ్యాఖ్యలకు చోటుకల్పిస్తూ...ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ...40-50ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఓ బడానేత...బారామతి లోక్ సభస్థానంలో పోలింగ్ తర్వాత తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని...శరద్ పవార్ పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. జూన్ 4తర్వాత చిన్నపార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్ లో విలీనమవుతాయని అన్నారు. నకిలీ ఎన్ సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నాయని...శరద్ పవార్ , ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com