G20 Summit: జీ20 సమ్మిట్‌కు మోడీ హాజరు..ట్రంప్ గైర్హాజరు..

G20 Summit: జీ20 సమ్మిట్‌కు మోడీ హాజరు..ట్రంప్ గైర్హాజరు..
X
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌ వేదికగా సదస్సు

దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు. ఇక జీ20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో మోడీ ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లడం లేదు. దక్షిణాఫ్రికాలో శ్వేతసౌధ రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సమ్మిట్‌కు వెళ్లడం లేదని ట్రంప్ ప్రకటించారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే G20 సమ్మిట్‌లో అధికారిక చర్చల్లో అమెరికా పాల్గొనదని వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ గురువారం ప్రకటించారు. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి మైనారిటీ పట్ల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో అమెరికా బహిష్కరణ నిర్ణయం ముడిపడి ఉందని వైట్ హౌస్ పేర్కొంది. ‘శ్వేతజాతి ఆఫ్రికన్ల మారణహోమాన్ని’ దక్షిణాఫ్రికా అనుమతించిందని ఆరోపించింది. అయితే ఈ వాదనను దక్షిణాఫ్రికా అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇక అమెరికా బహిష్కరణ కారణంగా శిఖరాగ్ర సమావేశం ముగింపులో G20 అధ్యక్ష పదవిని ‘ఖాళీ కుర్చీ’కి అప్పగించాల్సి వస్తుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా గతంలో విచారం వ్యక్తం చేశారు.

ఇక జీ20 సమ్మిట్‌లో మూడు సెషన్లలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. భారతదేశ అభిప్రాయాలను మోడీ వ్యక్తపరుస్తారని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై బలమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు మద్దతు ఇచ్చే లేదా ఆర్థిక సహాయం చేసే దేశాలపై సమిష్టిగా పోరాటం చేయాలని మోడీ ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని ప్రకటించేందుకు మోడీ కోరే అవకాశం ఉంది. ఇక భారతదేశం-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (IBSA) ఫోరమ్ ద్వారా సహా బలమైన సహకారానికి భారతదేశం ఒత్తిడి తెస్తుందని వర్గాలు పేర్కొన్నాయి. శిఖరాగ్ర సమావేశంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, భద్రతకు సంబంధించిన విషయాలను చర్చించడానికి ప్రధానమంత్రి మోడీ వివిధ ప్రపంచ నాయకులను కూడా కలవనున్నారు.

Tags

Next Story