Narendra Modi: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

Narendra Modi:  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌
ఎన్నికలకు ఎన్డీయే కూటమి సర్వసన్నద్ధంగా ఉందన్న ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికలకు NDA పూర్తిగా సిద్ధమైందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మోదీ తెలిపారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాల్లో అందించిన సేవల ట్రాక్ రికార్డుతో ప్రజల వద్దకు వెళతామన్నారు. వచ్చే ఐదేళ్లు దేశానికి రాబోయే వెయ్యేళ్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. శ్రేయస్సు.., సర్వతోముఖాభివృద్ధి, ప్రపంచ నాయకత్వ దిశగా భారత్ ను అభివృద్ధి పంథాలో నడిపిస్తామన్నారు. మరోసారి మోదీ సర్కార్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.

మోదీ ఏమన్నారంటే..

పదేళ్ల కిందట, మేం ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఇండియా కూటమి చేతిలో తాము మోసపోయామని భావించిన ప్రజలు, ఆ కూటమి దరిద్రగొట్టు పాలనకు చరమగీతం పాడారు. ఫలానా రంగంలో స్కాం జరగలేదు అనకుండా, ప్రతి ఒక్క రంగంలోనూ కుంభకోణాలకు పాల్పడ్డారు. తమ అనారోగ్యకర ప్రభుత్వ విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టించారు. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా భారత్ ను దూరంగా ఉంచింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రావడం, దేశం అద్భుతమైన మలుపు తీసుకుంది.

140 కోట్ల మంది ప్రజలతో పరిపుష్టమైన దేశం అభివృద్ధి పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మనం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. కోట్లాది మంది ప్రజలు దారిద్ర్యం నుంచి విముక్తి పొందారు. మా పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుతున్నాయి. అన్ని వర్గాలను సంతృప్తి పరచడం గొప్ప ఫలితాలను ఇచ్చింది. చిత్తశుద్ధి, నిబద్ధత, చెప్పింది చేసే సామర్థ్యం ఉన్న ఓ ప్రభుత్వం ఏమి చేయగలదో భారతదేశ ప్రజలు కళ్లారా చూశారు. అందుకే ప్రజలు మా నుంచి ఇంకా ఆశిస్తున్నారు. ఈ కారణంగానే దేశంలోని మూలమూలలా అన్ని వర్గాల ప్రజలు అబ్ కీ బార్ 400 పార్ (ఈసారి 400 సీట్లు) అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

మన ప్రతిపక్షం ఇప్పటికీ అరాచకత్వాన్నే నమ్ముకుంది. వాళ్ల దగ్గర పోరాడేందుకు తగిన అంశాలే లేవు. వారు చేయగలిగిందల్లా... మనల్ని తిట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం. వారి కుటుంబ రాజకీయాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి అవినీతి చిట్టా కూడా ఘనంగానే ఉంది. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. మేం ఈ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేయాల్సిన పని చాలా ఉంది. ఈ పదేళ్ల కాలం అంతా గతంలో 70 ఏళ్లు పాలించిన వారి డొల్లలను పూడ్చడానికే సరిపోయింది. ముఖ్యంగా, భారత్ ఆత్మ నిర్భరత సాధిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఈ స్ఫూర్తి ఆధారంగానే అభివృద్ధి చేస్తాం. మనందరం కలిసికట్టుగా లక్ష్యాన్ని అందుకుందాం" అని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story