Wayanad : నవంబర్ 13న వయనాడ్ ఉప ఎన్నిక పోలింగ్

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లో రెండు లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ఈసీ మంగళవారం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేరళలో ఒక లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని బరిలో దించుతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. పాలక్కడ్, చెలక్కార (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు రాహుల్ మమ్కూటథిల్, రమ్య హరిదాస్ పేర్లను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లయింది. లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన రాహుల్.. కీలకమైన ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్బరేలీలోనే కొనసాగాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ను వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ లోక్సభ సీటుతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com