Pune: ఏడో అంతస్తు నుంచి దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

మహారాష్ట్రలోని పుణేలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్యాలయ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నాసిక్కు చెందిన 23 ఏళ్ల పీయూష్ అశోక్ కవాడే పుణేలోని హింజేవాడి ఐటీ పార్కులోని ఒక కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అతడు కంపెనీ సమావేశానికి హాజరయ్యాడు. మధ్యలో అస్వస్థతగా ఉందని చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కార్యాలయ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మృతుడి వద్ద పోలీసులు సూసైడ్ నోట్ను గుర్తించారు. "నేను జీవితంలో విఫలమయ్యాను. నన్ను క్షమించండి. మీకు కొడుకుగా ఉండేందుకు నేను అర్హుడిని కాదు" అని కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com