Ranya Rao: హైకోర్టును ఆశ్రయించిన రన్యారావు తల్లి..

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ఆర్థిక నేరాల స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా, ఆమె ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. నటిపై విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం1974 కింద కేసు నమోదవడంతో జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నది. ఈ క్రమంలో రన్యారావు తల్లి కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను నిర్బంధించారని.. ఇది చట్ట విరుద్ధమంటూ హెబియన్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
దుబాయి నుంచి 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మార్చి 3నన బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావును అరెస్టు చేశారు. దాదాపు రూ.12.56కోట్ల విలువైన బంగారాన్ని నడుము, కాళ్లకు బ్యాండేజీలు, టిష్యూ పేపర్ల సహాయంతో చుట్టుకొని దాచి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ వ్యవహారంపై కస్టమ్స్ చట్టం, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెపై డీఆర్ఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మే 20న బెయిల్ మంజూరు చేసింది. కాఫెపోసా చట్టం కింద కేసు నమోదైంది. దాంతో ఆమె జైలునే ఉండాల్సి వచ్చింది. అక్రమ రవాణాలో పాల్గొనడం, స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం.. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణకు భంగం కలిగించే పనులు చేసినట్లు అనుమానం ఉన్న వ్యక్తులను విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.
అయితే, కాఫెపోసా చట్టం కింద కేసు నమోదు కాగా.. అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్ ఈ విషయంలో అభ్యంతరాలు దాఖలు చేశారని సమర్పించారు. ఆ తర్వాత కోర్టు విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. రన్యారావు, తరుణ్ కొండారు రాజు ఇద్దరినీ గత నెలలో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, ఒక్కొక్కరికి రూ.2 లక్షల బాండ్ను సమర్పించాలంటూ బెయిల్ మంజూరు చేసింది. నిందితులు దేశం విడిచి వెళ్లకూడదని, మళ్లీ నేరాలకు పాల్పడొద్దని ఆదేశించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ణీత వ్యవధిలోపు చార్జిషీట్ సమర్పించడంలో విఫలమైన తర్వాత బెయిల్ మంజూరు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com