Maharashtra: అజ్ఞాతంలో 11 మంది ఎమ్మెల్యేలు.. మహారాష్ట్రలో శివసేన కూటమి కూలిపోనుందా..?

Maharashtra: అజ్ఞాతంలో 11 మంది ఎమ్మెల్యేలు.. మహారాష్ట్రలో శివసేన కూటమి కూలిపోనుందా..?
Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వానికి రెబల్స్‌ గండం పట్టుకుంది. మహా వికాస్ అఘాడీ కూలిపోతుందన్న టాక్ వినిపిస్తుంది.

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వానికి రెబల్స్‌ గండం పట్టుకుంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతుందన్న టాక్ వినిపిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన రాజకీయ సంక్షోభం.. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మరింత ముదిరింది. మంత్రి ఏకనాథ్‌ షిండే.. సహా 11 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా నెలకొంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను రెబల్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో లేరు. దీంతో ఉద్ధవ్‌ ప్రభుత్వానికి కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు కమలం నేతలు కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు నమ్మినబంటుగా ఉన్న మంత్రి ఏకనాథ్ షిండే.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్టు సమాచారం. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా గుజరాత్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లీ వెళ్లడంతో.. ఏం జరుగుతుందనే టెన్షన్‌... శివసేన వర్గంలో నెలకొంది. రెబల్‌ ఎమ్మెల్యేలంతా.. అమిత్‌ షాను కలిసేందుకు ఫడ్నవీస్‌ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. రాజకీయ సంక్షోభంపై శరద్‌ పవార్‌ స్పందించారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందన్నారు. సమస్యను త్వరగానే పరిష్కరిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఒక్క సీటు మాత్రమే తగ్గిందని.. ఎమ్మెల్యేల తిరుబాటు శివసేన అంతర్గత విషయమన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, బహుజన్ వికాస్, సమాజ్‌వాదీ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో శివవసేన 56, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, బహుజన్ వికాస్ పార్టీకి 3, సమాజ్ వాదీ పార్టీకి 2, ప్రహార్ జనశక్తి పార్టీకి 2, పీడబ్ల్యూపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

మరో 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉద్దవ్‌ థాక్రే సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు విపక్షంలో కూర్చున్న బీజేపీ కూటమి బలం 113గా ఉంది. అందులో బీజేపీకి 106, ఆర్ఎస్పీకి ఒకటి, జేఎస్ఎస్‌కి ఒకటి, ఐదు మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు కూటములు కాకుండా ఎంఐఎంకు ఇద్దరు, సీపీఐ, ఎంఎన్ఎస్, స్వాభిమాన్ పక్ష్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. శివసేన నుంచి ప్రస్తుతం దూరమైన 11 మంది ఎమ్మెల్యేలకు తోడు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇంకొందరిని బయటికి లాగేసి, ఇండిపెండెంట్ల మద్దతుతో సర్కారు ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story