Fertilizer Crisis : రైతన్నకు కొత్త చిక్కులు.. అరేబియా సముద్రంలో ఉద్రిక్తతలతో ఎరువుల రేట్లకు రెక్కలు.

Fertilizer Crisis : ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు మన వంటింటి మీద కూడా ప్రభావం చూపుతాయనేది అక్షర సత్యం. ప్రస్తుతం పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం పొంచి ఉండటంతో, భారతదేశ వ్యవసాయ రంగంపై ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో, ఎరువుల దిగుమతులపై మనం ఇతర దేశాలపై ఎంతలా ఆధారపడుతున్నామో ఈ సంక్షోభం మరోసారి గుర్తుచేస్తోంది. ముడి చమురు విషయంలో మనకు వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి కానీ, ఎరువుల విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంటే సరఫరా గొలుసులో ఏదైనా ఆటంకం కలిగితే నేరుగా రైతుకు ఎరువులు అందకపోయే ప్రమాదం ఉంది.
మనం యూరియా కోసం ప్రధానంగా ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాం. ఈ దేశాల నుంచే మనకు అత్యధిక శాతం ఎరువులు వస్తాయి. ఈ భారం ఎంతలా ఉందంటే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ. 1.86 లక్షల కోట్లకు చేరింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం సబ్సిడీలో 40 శాతానికి పైమాటే. ఒకవేళ హోర్ముజ్ జలసంధి మూతపడితే, రవాణా ఖర్చులు పెరిగి ఈ సబ్సిడీ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది.
కేవలం దిగుమతుల భరమే కాదు, దశాబ్దాలుగా రసాయనిక ఎరువుల విపరీత వాడకం వల్ల మన నేల తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. శాస్త్రవేత్తల ప్రకారం నత్రజని, భాస్వరం, పొటాష్ (NPK) వాడకం 4:2:1 నిష్పత్తిలో ఉండాలి. కానీ మన దగ్గర ఇది 10.9:4.4:1 కి చేరుకుంది. అంటే మనం అవసరానికి మించి రసాయనాలను నేలలోకి కుక్కుతున్నాం. మనం వేసే ఎరువుల్లో అధిక భాగం గాలిలో కలిసిపోవడం లేదా భూగర్భ జలాల్లోకి వెళ్లడం వల్ల నేల సారం తగ్గిపోవడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా బయో-ఫెర్టిలైజర్స్ (జీవ ఎరువులు) తెరపైకి వస్తున్నాయి. ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవుల ద్వారా నేలలో సహజంగా నత్రజనిని పెంచుతాయి. రసాయనిక ఎరువుల కంటే ఇవి చౌకగా లభించడమే కాకుండా, వీటిని మన దేశంలోనే తయారు చేసుకోవచ్చు. సిక్కిం వంటి రాష్ట్రాలు ఇప్పటికే పూర్తి సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయగా, ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా లక్షలాది మంది రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఇది ఒక మంచి సంకేతం.
అయితే, జీవ ఎరువుల వాడకం పెరగాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం. రసాయనిక ఎరువులకు ఇస్తున్నట్లుగా వీటికీ సబ్సిడీలు ఇవ్వాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించినట్లుగా, ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తే, వారు తమకు నచ్చిన ఎరువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల జీవ ఎరువుల మార్కెట్ పెరుగుతుంది. హోర్ముజ్ జలసంధి సంక్షోభం మనకు ఒక హెచ్చరిక లాంటిది. దిగుమతి చేసుకునే ఎరువులపై ఆధారపడటం తగ్గించి, సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు మళ్లడం ఇప్పుడు మనకు అత్యవసరం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
