Bansuri Swaraj : ఎన్నికల బరిలో సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్

Bansuri Swaraj :  ఎన్నికల బరిలో సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్
న్యూఢిల్లీ నియోజకవర్గం టికెట్ ను కేటాయింపు

బీజేపీ విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల్లో దివంగత నేత సుష్మ స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయవాది బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోని ఐదు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కూడా నేటి జాబితాలో పేర్కొన్నారు. ఇందులో బాన్సురి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. బాన్సురి స్వరాజ్ ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్ఠానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల బాన్సురి స్వరాజ్‌ను బీజేపీ ఢిల్లీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమించింది.

బాన్సురి స్వరాజ్ న్యాయవాద వృత్తిలో పదిహేనేళ్ల అనుభవాన్ని కలిగి ఉన్నారు. 2007లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన బీపీపీ లాలో లా డిగ్రీని అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని సెయింట్ కేథరీన్ కాలేజీ నుంచి తన మాస్టర్స్ ఆఫ్ స్టడీస్‌ను పూర్తి చేశారు. బాన్సురి గతంలో హర్యానా రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గానూ వ్యవహరించారు.

"నాకెంతో సంతోషంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు, ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 400 లోక్ సభ స్థానాలు గెలవాలన్న బీజేపీ లక్ష్య సాధన కోసం నా వంతు కృషి చేస్తాను. నరేంద్ర మోదీని దేశ 'ప్రధాన సేవకుడు'గా మూడోసారి కూడా గెలిపించేందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాటుపడతారు" అని బాన్సురి స్వరాజ్ తెలిపారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే 195 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడోసారి వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి హోంమంత్రి అమిత్ షా మళ్లీ బరిలోకి దిగనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story