Tamilnadu: బాణసంచా కర్మాగారంలో ప్రమాదం..10 మంది దుర్మరణం

Tamilnadu: బాణసంచా కర్మాగారంలో  ప్రమాదం..10 మంది దుర్మరణం
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

తమిళనాడులో అరియలూరు జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. దారుణమైన ఈ సంఘటన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నగదు సాయం ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున , తీవ్రగాయాలపాలైన వారికి రూ.1 లక్ష, ఓ మోస్తరు గాయాలకు గురైనవారికి రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరానప్పటికీ అరియలూరు జిల్లా విరగలూరు గ్రామంలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. గాయపడిన ఐదుగురిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని సీఎం స్టాలిన్ తెలిపారు.


ఆ సమయంలో కార్మికులు అల్పాహారం తీసుకుంటున్నారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో వారంతా కర్మాగారంలోనే చిక్కుకుపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే బాణసంచా కర్మాగారం వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు శ్రమించారు. బాణసంచా తయారీ కేంద్రం లోపల చిక్కుకున్న కార్మికులను స్థానికుల సాయంతో బయటికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. వెట్రియూర్ కు చెందిన రాజేంద్రన్ ఈ బాణసంచా కర్మాగారం యజమాని. పదేళ్ల కిందట ఈ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. కాగా, బాణసంచా కర్మాగారంలో పేలుడు ఎందుకు జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు.


Tags

Read MoreRead Less
Next Story