Terror Attack: జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో 27 మంది మృతి

Terror Attack: జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో 27 మంది మృతి
X
మరణించిన వారిలో ఇజ్రాయెల్, ఇటాలియన్ టూరిస్టులు!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్‌ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టమైంది.

బైసరన్‌లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. తొలుత మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం 27కి చేరినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కాల్పుల ఘటనతో పహల్గాం వీధులు నిర్మానుష్యంగా మారాయి. పర్యటకులు సైతం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలిసింది.

Tags

Next Story