Prime Minister Modi : దేశం గొప్ప నేతను కోల్పోయింది: ప్రధాని మోదీ

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆయన మరణం దేశానికి తీరని లోటు. కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధానిగా దేశానికి సేవలందించారు’ అని చంద్రబాబు కొనియాడారు. ‘మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, మానవతావాది. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని రేవంత్ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన్మోహన్ ఇక లేరన్న విషయం బాధకు గురిచేసిందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. దేశం ఒక మహోన్నత వ్యక్తికి కోల్పోయిందని చెప్పారు.
అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్కు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com