AMARNATH: అమర్ నాథ్ యాత్రలో విషాదం

అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గత రెండు రోజుల్లో 9 మంది యాత్రికులు మృతి చెందారు.కొండచరియలు విరిగిపడడం, భారీ వర్షాలు, మంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అమర్నాథ్ యాత్ర వరసగా రెండోరోజూ నిలిచిపోయింది. వేలసంఖ్యలో యాత్రికులు మధ్యలో చిక్కుకుపోయారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో పహల్గావ్, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. దాదాపు 50 వేల మంది తమతమ బేస్ క్యాంపుల్లోనే ఉండిపోయారు. నిన్నతెల్లవారుజామున కురిసిన వర్షాలకు రంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. యాత్రికులు జమ్మూ నుంచి బయల్దేరకుండా నిలిపివేశారు. మధ్యలో ఉన్నవారిని సమీపంలోని బేస్క్యాంప్లకు తరలించారు. ఎవరూ వాటిని వీడి ముందుకు వెళ్లడానికి అనుమతించలేదు. ఇవాళ కూడా జమ్మూ-కశ్మీర్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కొన్నిచోట్ల భారీవానలు కురుస్తాయని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com