Trolling Modi: రూల్స్ పట్టించుకోని మోదీ.. పాటించిన బ్రిటన్ ప్రధాని.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్తో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఒక ఫొటో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ ఫొటోలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సీటు బెల్టు ధరించి ఉండగా, ప్రధాని మోదీ మాత్రం ఎలాంటి సీటు బెల్టు పెట్టుకోకుండా కెమెరాకు పోజులిస్తూ కనిపించారు.
ఈ ఫొటో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలను స్వయంగా ప్రధానే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మన దేశానికి అతిథిగా వచ్చిన బ్రిటన్ ప్రధాని నిబంధనలు పాటిస్తుంటే, మన ప్రధాని వాటిని విస్మరించడం సరైన సందేశం కాదని కామెంట్లు పెడుతున్నారు. దేశ ప్రధానే ఇలా చేస్తే సాధారణ పౌరులు నిబంధనలను ఎలా గౌరవిస్తారంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు, ముంబైలో ప్రధాని మోదీతో భేటీ అయిన కీర్ స్టార్మర్, భారత ఆర్థిక ప్రగతిపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడాన్ని ఆయన గుర్తుచేశారు. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ దూసుకెళ్తోందని స్టార్మర్ కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com