WAR: పశ్చిమాసియా సెగ: రూ. 10 లక్షల కోట్ల సంపద ఆవిరి!

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు భారతీయ స్టాక్ మార్కెట్లను బూడిద చేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఐదో రోజుకు చేరడం, యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రభావంతో గురువారం దలాల్ స్ట్రీట్ కుప్పకూలింది. ఒక్కరోజే మదుపర్ల సంపద రూ. 10 లక్షల కోట్లు హరించుకుపోయింది.
రక్తసిక్తమైన సూచీలు
ఉదయం నుంచే నష్టాల బాటలో పయనించిన సెన్సెక్స్, ఒకానొక దశలో 1,700 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లను వణికించింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి కొంత కోలుకుని 1,122.66 పాయింట్ల నష్టంతో 79,116.19 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 385.20 పాయింట్లు కోల్పోయి 24,480.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 466 లక్షల కోట్ల నుంచి రూ. 456 లక్షల కోట్లకు పడిపోయింది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలివే..
యుద్ధ భయాలు: ఇరాన్ రాజధాని టెహ్రాన్, లెబనాన్ రాజధాని బీరుట్లపై దాడులు ఉధృతం కావడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగవచ్చన్న సంకేతాలు ఇన్వెస్టర్లను సురక్షిత ఆస్తుల వైపు మళ్లించాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది. పాతాళానికి రూపాయి: యుద్ధ ప్రభావంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే 69 పైసలు క్షీణించి 92.18 వద్దకు చేరడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) భారత మార్కెట్ల నుంచి నిధులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి 2న ఒక్కరోజే రూ. 3,295 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది. పెరిగిన చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో, అటు అమెరికా ఫెడ్ రిజర్వ్, ఇటు ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
రంగాల వారీగా..
సెన్సెక్స్ 30 సూచీలో దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ భారీగా నష్టపోయాయి. అయితే మార్కెట్ ఇంత దారుణంగా ఉన్నా భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ, టెలికాం షేర్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కడం గమనార్హం. మరోవైపు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 5,185 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుద్ధం మరింత ముదిరితే రానున్న రోజుల్లో మార్కెట్లు మరిన్ని ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
