WAR: ఖమేనీ, నెతన్యాహు.. బతికే ఉన్నారా?

‘‘యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే’’ అని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికన్ సెనెటర్ హైరామ్ జాన్సన్ అన్న మాటలు, నేటి పశ్చిమాసియా రణరంగంలో అక్షర సత్యాలుగా మారుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ దాడుల నేపథ్యంలో సమాచార యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించగా, ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు భౌతికంగా ఎక్కడా ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ప్రత్యర్థులను మానసిక దెబ్బ తీయడానికి చేసే ప్రచారమో లేక నిజంగానే ఇరాన్ నాయకత్వ శూన్యతలో ఉందో తెలియక అంతర్జాతీయ సమాజం అయోమయంలో పడిపోయింది.
బ్రిటీష్ పత్రిక ‘ది సన్’ కథనం ప్రకారం, ఖమేనీ దాడుల్లో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారని, ఆయన కాళ్లు కోల్పోవడమే కాకుండా అంతర్గత అవయవాలు చిట్లిపోయాయని తెలుస్తోంది. ఇరాన్ లో వందలాది మంది ప్రజలు మొజ్తబా చిత్రపటానికి విధేయత ప్రకటిస్తున్న వీడియోలు బయటకు రావడం, సాధారణంగా అగ్రనేతలు బయటకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చిత్రపటాల ద్వారా మద్దతు తెలపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నారని, కానీ ఆయన ‘బాగా దెబ్బతిన్నారని’ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వం ఈ వార్తలను ఖండిస్తూ లేఖలు విడుదల చేస్తున్నప్పటికీ, ఒక్క నిమిషం లైవ్ వీడియోలో ఎందుకు కనిపించడం లేదన్న ఇజ్రాయెల్ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.
నెతన్యాహు విషయంలోనూ...
కేవలం ఇరాన్ వైపు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు విషయంలోనూ ఇలాంటి వింత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు ఉన్న బంకర్ ధ్వంసమైందని, ఆయన మరణించారంటూ ఇరాన్ మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేయగా, దానికి తగ్గట్టుగానే ఆయన కూడా యుద్ధం మొదలైనప్పటి నుండి భౌతికంగా ఎక్కడా మీడియా కంటికి చిక్కలేదు. తాజాగా మార్చి 12న నెతన్యాహు వీడియో లింక్ ద్వారా మీడియా ముందుకు వచ్చినప్పటికీ, అది ‘కృత్రిమ మేధ’ (AI) సృష్టించిన మాయాజాలమని పలువురు అనుమానిస్తున్నారు. ఆ వీడియోలో నెతన్యాహు ఒక్కరే కనిపిస్తుండటం, ప్రశ్నలు అడిగే విలేకరుల ముఖాలు కనపడకుండా కేవలం గొంతులు మాత్రమే వినిపించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ముఖ్యంగా ఆ వీడియోలో నెతన్యాహు కుడిచేతికి ఆరు వేళ్లు కనిపించాయని, వేళ్ల పరిమాణంలో అసమానతలు ఉన్నాయని సోషల్ మీడియాలో వెలువడుతున్న విశ్లేషణలు ఏఐ మాయాజాలాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్లో యుద్ధ సైరన్లు మోగినా, నెతన్యాహు కనీసం కనురెప్ప సైతం ఆర్పకుండా, సైరన్ శబ్దాన్ని విననట్టుగా తాను అనుకున్నది చెప్పుకొంటూ పోవడం అత్యంత యాంత్రికంగా అనిపించింది. ఇలా ఇద్దరు బద్ధశత్రువులైన దేశాల అగ్రనేతలు ‘డిజిటల్ గూడు’ దాటి బయటకు రాకపోవడం, అగ్రనేతల అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకరు 23వ పులకేశిలా పట్టుకోల్పోయి, మరొకరు ఉత్తర కుమారుడిలా వెనకడుగు వేస్తూ కాలక్షేపం చేయడం దేశాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
