AIMIM Chief Owaisi : పాక్ ఇప్పుడేమంటుంది? ఎంఐఎం చీఫ్ ఒవైసీ సీరియస్

ఇరాన్ తో ఇజ్రాయెల్ కు జరుగుతున్న సంఘర్షణలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం, ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్పహాన్లపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ సిఫారసు చేసిన పాక్ ఇప్పుడేమంటుంది? అంటూ నిలదీశారు. అమెరికా చేసిన తాజా దాడులకు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతలు ఉపశమనానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్థాన్ శనివారంనాడు ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటలకే అమెరికా నేరుగా ఇరాన్ పై దాడులకు దిగిందని చెప్పారు. ట్రంపు నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేస్తామని ప్రకటించిన కొద్ది గంటలకే అమెరికా దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ పాక్ యూటర్న్ తీసుకోవడాన్ని ఒవైసీ నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com