Bird Flu : పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ..

భారత్లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ఫ్లూ(H9N2) సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ అడపాదడపా మనుషుల్లో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ్ బెంగాల్లో ఈ కేసు వెలుగుచూసింది.
తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కొద్దిరోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఆ చిన్నారి ఇంటితో పాటు సమీపంలో కోళ్లు ఎక్కువగా ఉండేవని ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఆ కుటుంబంలో మరెవరికీ ఈ వైరస్ నిర్ధారణ కాలేదని తెలిపింది. భారత్లో H9N2 బర్డ్ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ రకంతో వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటాయని వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. బర్డ్ఫ్లూ H5N2 వేరియంట్తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం అదే అని వెల్లడించింది. అయితే.. పౌల్ట్రీ, జంతువుల వద్దకు అతడు వెళ్లిన ఆధారాలు కూడా లేవని తెలిపింది. ఆయనకు మొదటి నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com