ASIA GAMES: 107 పతకాలతో సత్తా చాటిన భారత్

చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్ను భారత్ ఘనంగా ముగించింది. గతంతో ఎన్నడూ లేనని పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. మొత్తం 107 పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో కొత్త చరిత్ర లిఖించింది. నేటితో ఆసియా గేమ్స్ ముగియనుండగా ఇప్పటికే భారత్ పోటీపడే విభాగాలన్నీ పూర్తయ్యాయి. చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో, కొరియా మూడో స్థానంలో నిలిచాయి.
భారత్ శనివారం ఒక్కరోజే ఆరు స్వర్ణ పతకాలు సహా 12 పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ ముచ్చటగా మూడో పసిడి పతకం సాధించింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దక్షిణకొరియాకు చెందిన సో చెవాన్పై జ్యోతిసురేఖ విజయం సాధించి స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగాఅభిషేక్ రజతం సాధించాడు. చివరి నిమిషంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్లో భారత్ 33-29 తేడాతో ఇరాన్పై గెలిచి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి దక్షిణ కొరియా జంట చోయ్ సోల్ జియు-కిమ్ వన్ హోల్పై 21-18, 21-16 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పతకంతో ఆసియా క్రీడల బాడ్మింటన్లో స్వర్ణాన్ని నెగ్గిన తొలి భారత్ డబుల్స్ జోడీగా రికార్డు సాధించారు.
టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్తో జరగాల్సిన ఫైనల్ వర్షం వల్ల రద్దవ్వడంతో టీమిండియా పసిడిని దక్కించుకుంది. అఫ్గాన్ కంటే ర్యాంకింగ్లో భారత్ ముందుండడంతో టీమిండియాకు పసిడి దక్కింది. మహిళల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. పురుషుల రెజ్లింగ్ 86కిలోల విభాగంలో దీపక్ పూనియా తుది పోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. చెస్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో కూడిన మహిళల జట్టు.. రజత పతకం సాధించగా ప్రజ్ఞానంద, అర్జున్లతో కూడిన పురుషుల జట్టు కూడా రజత పతకం కైవసం చేసుకుంది. చెస్లో రెండు రజత పతకాలతో భారత్ ఆసియా గేమ్స్ 2023కు ఘనంగా వీడ్కోలు పలికింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com