CWC2023: ప్రపంచకప్లో ఆగని జైత్రయాత్ర

ప్రపంచకప్లో టీమిండియా వరుసగా అయిదో విజయం నమోదు చేసింది. 2019 సెమీస్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. కింగ్ కోహ్లీ 95 పరుగులతో రాణించగా.... షమీ అయిదు వికెట్లతో సత్తా చాటగా భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సులతో 95 పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. .
ఈ మ్యాచ్లో టాస్ ఓడిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే వికెట్ తీసి మహ్మద్ సిరాజ్ కివీస్కు షాక్ ఇచ్చాడు. ఈ ప్రపంచకప్లో మంచి ఫామ్లో ఉన్న కాన్వేను సిరాజ్ అవుట్ చేశాడు. తొమ్మిది పరుగులకే న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే ఈ ప్రపంచకప్లో తొలి మ్యాచ్ ఆడుతున్న షమీ రెండో షాక్ ఇచ్చాడు. విల్ యంగ్ను షమీ బౌల్డ్ చేయడంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్ అద్భుత భాగస్వామ్యంతో కివీస్ మళ్లీ పోరులోకి వచ్చింది. వీళ్లిద్దరూ మూడో వికెట్కు 159 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి కివీస్ భారీ స్కోరుకు బాటలు వేశారు. 87 బంతుల్లో 75 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర... షమీ బౌలింగ్లో గిల్కు సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రచిన్ రవీంద్ర అవుటైనా మిచెల్ మాత్రం పట్టువదలలేదు. 127 బంతుల్లో 9 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 130 పరుగులు చేశాడు. మిచెల్ శతకంతో న్యూజిలాండ్ 273 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బ్రుమా 1, మహ్మద్ సిరాజ్ 1, షమీ 5, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు.
286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. రోహిత్ శర్మ- శుభ్మన్ గిల్ జోడి తొలి వికెట్కు 11 ఓవర్లలోనే 71 పరుగులు చేసి బలమైన పునాది వేసింది. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి దూకుడు మీదున్న రోహిత్ను ఫెర్గ్యూసన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే 26 పరుగులు చేసిన గిల్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో 76 పరుగులకు టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లీ, అయ్యర్ ఇన్నింగ్స్ను పునర్నిర్మించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను బౌల్ట్ విడదీశాడు. 33 పరుగులు చేసిన అయ్యర్ను అవుట్ చేశాడు. 27 పరుగులు చేసిన రాహుల్ అవుటవ్వడం.. అనవసర పరుగుకు యత్నించి సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరడంతో 191 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడ్డట్లు అనిపించింది. కానీ విరాట్ కోహ్లీ-రవీంద్ర జడేజా అద్భుత భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు. కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సులతో 95 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివర్లో కోహ్లీ అవుటైనా అప్పటికే టీమిండియా విజయం ఖాయమైంది. జడేజా 44 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com