ICC U19 వరల్డ్ కప్ లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన భారత్

ICC U19 వరల్డ్ కప్ లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన భారత్

ఆరోసారి చాంపియన్‌గా నిలవాలనే ఉద్దేశ్యంతో అండర్‌-19 ప్రపంచకప్‌లోకి (ICC U-19 World Cup) అడుగుపెట్టిన భారత జట్టు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి, ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను సులభంగా ఓడించింది. బ్లూమ్‌ఫోంటైన్‌లో జరిగిన ఈ గ్రూప్-ఎ మ్యాచ్‌లో, టీమ్ ఇండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 301 పరుగులు చేసింది. తరువాత ఐర్లాండ్‌ను 100 పరుగులకు ఆలౌట్ చేసి 201 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో సూపర్ సిక్స్‌లో టీమిండియా స్థానం దాదాపు ఖాయమైంది.

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఉదయ్ సహారన్ (Captain Uday Saharan) సారథ్యంలోని టీమిండియా పటిష్ట స్కోరు చేసింది. కెప్టెన్ సహారాన్ స్వయంగా వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించగా, అద్భుతమైన సెంచరీ చేసిన ముషీర్ ఖాన్ రియల్ హీరో అని నిరూపించుకున్నాడు. దీని తర్వాత ఇద్దరు ఎడమచేతి వాటం బౌలర్లు నమన్ తివారీ ,సౌమ్య పాండే ఐర్లాండ్ బ్యాటింగ్‌ను ధ్వంసం చేసి జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించారు.

గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (Adarsh Singh) ఈసారి తొందరగా ఔట్ కాగా, రెండో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (Arshin Kulkarni) ఈసారి తన ప్రారంభాన్ని పెద్ద స్కోరుగా మార్చడంలో విఫలమయ్యాడు. 20వ ఓవర్లో రెండో వికెట్ పడే సమయానికి టీమిండియా స్కోరు 80 పరుగులు మాత్రమే. ఇక్కడి నుంచి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ బ్యాటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.

వీరిద్దరు మూడో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఉదయ్ 75 పరుగులు చేసి ఔట్ కాగా, ముషీర్ 106 బంతుల్లో 117 పరుగులతో పటిష్ట ఇన్నింగ్స్ ఆడాడు.ఆ తర్వాత చివరి ఓవర్లలో ఆరవెల్లి అవినాష్, సచిన్ దాస్ వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో జట్టు స్కోరు 301కి చేరుకుంది. 7 వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ తరఫున ఒలివర్ రిలే 10 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.

దీనికి ప్రతిగా బ్యాటింగ్ మొదలు పెట్టిన ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు మ్యాచ్‌లో ఎప్పుడూ గెలిచేలా కనిపించలేదు. భారత్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ నమన్ తివారీ ఐర్లాండ్ టాప్, మిడిల్ ఆర్డర్‌ను ధ్వంసం చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్ 22 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో ప్రారంభించింది, అయితే 15వ ఓవర్‌కు 8 వికెట్లు పడిపోయాయి ,స్కోరు 45 పరుగులు మాత్రమే ఉంది. లోయర్ ఆర్డర్‌లో, ఒలివర్ రిలే (15), డేనియల్ ఫోర్కిన్ (27 నాటౌట్) కొంత పోరాటం చేశారు, దీని కారణంగా ఐర్లాండ్ జట్టు ఎలాగో 100 పరుగులకు చేరుకుంది. నమన్‌తో పాటు స్పిన్నర్ సౌమ్య పాండే 3 వికెట్లు తీశాడు.

Tags

Read MoreRead Less
Next Story