కరోనాతో హాకీ దిగ్గజం కన్నుమూత.. !
కరోనా మరో క్రీడాకారున్ని బలి తీసుకుంది. కరోనాతో భారత హాకీ దిగ్గజం రవీందర్ పాల్ సింగ్ (60) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 24న కరోనా సోకడంతో లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. వైరస్ నుంచి గురువారం కోలుకోవడంతో సాధారణ వార్డుకు చేర్చగా.. శుక్రవారం హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పైకి మార్చారు. అయితే చికిత్స ఫలితం లేకుండా కన్నుమూశారు. 1980లో మాస్కో ఒలింపిక్ విజేత జట్టులో ఆయన ఉన్నారు. కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్ జూబ్లీ కప్ (హాంకాంగ్), 1982 ప్రపంచకప్ (ముంబయి), 1982 ఆసియా కప్ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1984 లాస్ ఏంజెల్స్లో జరిగిన ఒలింపిక్స్లోనూ ఆయన పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల క్రీడా మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. అటు ఆయన వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని హాకీ ఆటకే అంకితం చేశారు. కాగా, ఆయనని ఆయన మేనకోడలు ప్రగ్యా యాదవ్ ఇప్పటి వరకు చూసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com