Mumbai Indians : గుజరాత్ ను ఇంటికి పంపిన ముంబై.. రేపు పంజాబ్ తో క్వాలిఫయర్ 2

ఐపీఎల్ 18వ ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ పోరాటం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఎంఐ రెండో క్వాలిఫయర్ కు అర్హత సాధించింది. రేపు పంజాబ్ తో అమీతుమీ తేల్చుకుంటుంది. కాగా, శుక్రవారం ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులే చేసి ఓటమిపాలైంది.
భారీ పరుగుల ఛేదనకు దిగిన గుజరాతకు ఆదిలోనే షాక్ లు తగిలినా.. తర్వాత ఓపెనర్ సాయి సుదర్శన్ (80; 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ హాఫ్ సెంచరీతో తమ జట్టును ఆదుకున్నాడు. ముందు కుశాల్ మెండిస్ (20)తో కలిసి రెండో వికెట్కు 64 పరుగులు జోడించిన ఇతడు.. అనంతరం వాషింగ్టన్ సుందర్ (48, 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు) తో కలిసి నాలుగో వికెట్ కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. ఇక ఆఖర్లో సెంచరీకి చేరువైన సుదర్శన్ (80)ను గ్లీసన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో మళ్లీ గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక చివర్లో రూథర్ ఫోర్డ్ (24), రాహుల్ వాటియా (16) కొద్దిసేపు పోరాడినా ఫలితం దక్కలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com