IPL 2025 : ఐపీఎల్ ఫైనల్లోకి పంజాబ్.. ముంబైకి షాక్.. బెంగళూరుపై ప్రతీకారానికి కింగ్స్ రెడీ

ఐపీఎల్ 18వ ఎడిషన్లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరింది. ఆదివారం ముంబైతో జరిగిన క్వాలిఫయర్ -2లో సంచలన విజయం నమోదుచేసింది. జూన్ 3న ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ముంబై విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఓవర్ మిగిలివుండగానే ఛేదించింది. 207 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఈ మ్యాచ్ లో గెలిచి ఆరోసారి టైటిల్ సొంతం చేసుకోవాలనుకున్న ముంబై ఆశలు ఆవిరయ్యాయి. బ్యాటింగ్ లో రాణించినప్పటికీ ఫీల్డింగ్ మరోసారి తేలిపోయారు. బౌలింగ్ లోనూ వాడితగ్గింది. ప్రత్యర్థిని నిలువరించలేక పోయింది.
వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ను ఆరంభంలో కట్టడి చేసిన ముంబై బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. ఓపెనర్లు ప్రియాంక్ (20), ప్రభ సిమ్రన్ (6) తక్కువ స్కోర్లకే ఔటైనప్పటికీ, జోష్ ఇంగ్లిస్ (38), నేహాల్ వధేరా (48) మెరుపు బ్యాటింగ్ చేయగా, మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముంబై బౌలింగ్ ను చిత్తు చేశాడు. 41 బంతుల్లో 87 పరుగులు సాధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com