CT2025: కివీస్‌తోనే భారత్‌ తుది పోరు

CT2025:   కివీస్‌తోనే భారత్‌ తుది పోరు
X
పరుగుల సమరంలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలుపు... పోరాడి ఓడిన ప్రొటీస్

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసి ఓడింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయి. ఈ మ్యాచ్‌లో సెంచరీల మోత మోగింది. మార్చి 9న జరిగే ఫైనల్ లో భారత్ తో న్యూజిలాండ్ తలపడనుంది.

రచిన్-కేన్ శతకమోత

ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్‌ ఓపెనర్లు రచిన్‌, యంగ్‌ (21) ఆ జట్టుకు మంచి ఆరంభమే అందించారు. ఆ జట్టు 48 పరుగుల వద్ద ఎంగిడి.. యంగ్‌ను ఔట్‌ చేయడంతో కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత విలియమ్సన్‌తో కలిసి రచిన్‌ రవీంద్ర సఫారీ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఎంగిడి, రబాడా, మహారాజ్‌, జాన్సెన్‌ను దీటుగా ఎదుర్కున్నాడు. 93 బంతుల్లో రచిన్ రవీంద్ర తన కెరీర్‌లో ఐదో శతకాన్ని అందుకున్నాడు. 40వ ఓవర్లో విలియమ్సన్‌ వన్డేలలో 15వ శతకాన్ని నమోదుచేశాడు. అదే ఓవర్లో అతడు నిష్క్రమించినా ఆఖర్లో మిచెల్‌ (49), ఫిలిప్స్‌ (49 నాటౌట్‌) ధాటిగా ఆడటంతో కివీస్‌ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 362/6 స్కోరు సాధించింది. ఎన్‌గిడి 3, రబాడ 2 వికెట్లు పడగొట్టారు.

ప్రొటీస్ పోరాడినా..

363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బాగానే పోరాడింది. బవుమా, డసెన్‌ పోరాటం ఆ జట్టుకు ఆశలు కల్పించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే కివీస్‌ సారథి శాంట్నర్‌.. సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ శాంట్నర్‌ (3/43) కీలక సమయంలో మూడు వికెట్లతో దెబ్బకొట్టడంతో సఫారీల ఆట ఒక్కసారిగా గతితప్పింది. బవుమా (56), డుస్సెన్‌ (69) రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అర్ధ శతకం సాధించిన బవుమాను శాంట్నర్‌ అవుట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 23 ఓవర్లలో 128/2. ఛేదనలో డేవిడ్‌ మిల్లర్‌ (67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్‌) శతకంతో పోరాడినా.. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. మల్డర్‌ (8), జెన్సన్‌ (3), కేశవ్‌ మహరాజ్‌ (1) సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగారు. చివరి బంతికి సెంచరీ చేసిన మిల్లర్‌.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. శాంట్నర్‌ 3, హెన్రీ, ఫిలిప్స్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Tags

Next Story