TEAM INDIA: యువభారత్ కు కఠిన "టెస్ట్"

TEAM INDIA: యువభారత్ కు కఠిన టెస్ట్
X
సీనియర్లు లేకుండా బరిలోకి టీమిండియా.. నిరూపించుకునే అవకాశం వచ్చిందన్న గంభీర్

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ లేని భారత జట్టుకు అసలు పరీక్ష ఎదురుకానుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. టీమ్‌ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. భారత జట్టుకు శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా, రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్లతో సీనియర్లు లేకుండానే గిల్‌ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రత్యేకంగా చేసి తమను తాము నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం అని టీమ్‌ఇండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. . ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. దాంతర్వాత భారత్ ఆడబోయే టెస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇంగ్లాండ్ టెస్ట్ గంభీర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

గంభీర్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం మనం ఉన్న స్థితిని రెండు కోణాల్లో చూడొచ్చని గంభీర్... యువ ఆటగాళ్లతో అన్నాడు. మనం ముగ్గురు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలోకి దిగుతున్నామని అన్నాడు. దేశం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మన చేతుల్లో అద్భుతమైన అవకాశం ఉందన్న గంభీర్... ఈ బృందంలో.. ఆకాంక్ష, అభిరుచి, ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే నిబద్ధత ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. మనం త్యాగాలు చేస్తే.. మనం కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వస్తే.. మనం పోరాడటం ప్రారంభిస్తే.. ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి బంతినీ మనం చిరస్మరణీయంగా మలుచుకోగలమని యువ ఆటగాళ్లకు గంభీర్ దిశానిర్దేశం చేశాడు. దాన్ని ఈరోజు నుంచే ప్రారంభించాలన్న గంభీర్... దేశం కోసం ఆడటం కంటే పెద్ద గౌరవం మరొకటి లేదన్నాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌ టూర్‌కు ముందు ఐపీఎల్‌ మధ్యలో టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్లను ఒకరి తర్వాత మరొకరు ప్రకటించారు.

తొలి మ్యాచుకు జట్టు కూర్పు ఎలా..?

ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచి లీడ్స్‌లో జరిగే తొలి టెస్ట్‌లో భారత్ ఎలా ఆడుతుందనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల కొంతమంది భారతీయ స్టార్లు ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడారు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఆ తరువాత రెండవ ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేశాడు. దీంతో ఓపెనర్‌గా అతనే బరిలోకి దిగవచ్చునని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్‌తో మొద‌టి టెస్టుకు భార‌త ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను టీమిండియా మాజీ క్రికెట‌ర్ రాబిన్ ఊతప్ప అంచనా వేశాడు. యశస్వి జైస్వాల్ తో పాటు కెఎల్ రాహుల్ ను కూడా ఓపెనర్లుగా పంపాలని రాబిన్ ఉతప్ప ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను కోరారు. తాను ప్రారంభంలోనే అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నాన్న ఊతప్ప... కెఎల్ రాహుల్ అక్కడ ఓపెనర్ గా ఆడాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఆస్ట్రేలియాలో అతను బ్యాటింగ్ చేసిన విధానం, ఇటీవల ఇంగ్లాండ్ లో ఆడిన తీరు విధానాన్ని పరిశీలిస్తే, టీమిండియా అతన్ని ఓపెనర్ గా ఆడించాలని సూచించారు. ఇక 3వ స్థానంలో సాయి సుదర్శన్ లాంటి ఆటగాడిని చూడాలనుకుంటున్నానని... ఎందుకంటే అతను సాంకేతికంగా చాలా మంచి బ్యాటర్ అని అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.శుభ్‌మన్ గిల్ కచ్చితంగా నాలుగో స్థానంలో ఉంటాడన్న ఊతప్ప... కరుణ్ నాయర్ 5వ స్థానంలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ స్థానంలో ఆడటానికి కొంత అనుభవం అవసరమన్నాడు. పంత్‌ను వికెట్ కీపర్‌గా, రవీంద్ర జడేజాను ఏకైక స్పిన్నర్‌గా ఆడించాలని ఊతప్ప... గంభీర్కు సూచించాడు. నితీష్ కుమార్ రెడ్డికి 7వ స్థానంలో రావాలని... నాలుగో ఫాస్ట్ బౌలర్ గా కూడా ఉపయోగపడతాడని ఊతప్ప అన్నాడు.

Tags

Next Story