PSLV-C59 Mission : పీఎస్ఎల్వీ-సీ59 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ59 ప్రయోగం సక్సెస్ అయింది. సరిగ్గా సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పెస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3లో ని రెండు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు శాస్త్రవేత్తలు.
ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. వాస్తవానికి ఈ ప్రయోగం నిన్ననే చేయాల్సి ఉండగా... సాంకేతిక కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది.
సాధారణంగా సూర్యుని ప్రచండ వెలుగుల మధ్య కరోనా పొరను గమనించడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుని ప్రకాశం.. కరోనా బ్రైట్ పాయింట్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది టెలిస్కోప్ను బ్లైండ్ చేస్తుంది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com