ఆషాడమాసంలో కొత్త జంట ఎందుకు కలిసి ఉండకూడదు.. కారణం ఇదేనట..!
మనపెద్దవాళ్ళు ఏం చెప్పిన, ఏం చేసిన దానికి వెనుక అర్ధం, పరమార్ధం అనేవి కచ్చితంగా ఉంటాయి. ఇక సంప్రదాయాల విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆషాడమాసంలో కొత్త జంట కలిసి ఉండకూడదు అనే ఆచారం ఉంది. అంతేకాకుండా అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. అయితే దీని వెనుక కూడా చాలా పెద్ద రహస్యమే ఉంది.
పూర్వం ఉద్యోగాలు లాంటివి లేవు కాబట్టి ఎక్కువగా వ్యవసాయం మీదా మాత్రమే ఆధారపడి బ్రతికేవారు. ఈ ఆషాడమాసం వర్షాలు అధికం కాబట్టి పొలం దగ్గర పనులు అధికంగా ఉంటాయి. కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఇద్దరినీ వేరువేరుగా ఉంచేందుకు ఈ నిబంధన పెట్టారు. అంతేకాకుండా ఈ మాసంలోనే వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. బ్యాక్టీరియా, వైరస్ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి.
ఈ సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం ఉండేది. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అంతేకాకుండా ఆషాడంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలకి అంటే చైత్రం పూర్తవుతుంది. అంటే ఎండాకాలంలో ప్రసవం జరుగుతుంది.
ఆ సమయంలో ఎండలకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని పెద్దలు అలోచించి ఈ నియమాన్ని పెట్టారు. అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వైపు చూడకూడదనే నియమాన్ని పెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com