TG : రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే.. ఏలేటి డిమాండ్

రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేబాటలో నడుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయలేకపోతోందని విమర్శించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడవటం బాధాకరమన్నారు.
గతంలో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రుణ మాఫీకి అర్హులు అయిన 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారని, కానీ ఇప్పుడు అందులో కోత విధించినట్లు బడ్జెట్ లెక్కలు చూస్తుంటే తెలుస్తోందన్నారు. ఈ మేరకు బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ఏ ప్రాతిపాదికన ణ మాఫీ కోసం రైతులను ఎంపిక చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించినందున ఎలాంటి మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది రైతు బంధు ఇప్పటి వరకు రైతులకు అందలేదని, రుణమాఫీ నిధుల కోసమే రైతుబంధును ఆపినట్టుగా కనిపిస్తోందని దుయ్యబట్టారు మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో రైతు బంధుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పై అసెంబ్లీ లో చర్చ పెడతామని సీఎం చెప్పారని, అయితే ఆ చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతుల గోసను పట్టించుకునే నాథుడే లేడని, తెలంగాణలో దాదాపు 15 లక్షల కౌలు రైతులు ఉన్నారని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com