Nagarjuna Sagar : నాగార్జునసాగర్ అన్ని గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

నాగార్జునసాగర్ గేట్లు ఉదయం దాదాపు పూర్తిగా తెరుచుకున్నాయి. డ్యాంకు వరద ప్రవాహం పొటెత్తింది. దీంతో సాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, ముందుగా 8 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత 22 గేట్లను ఎత్తారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం సైరన్ మోగించారు.
వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,23,748 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 582.60 అడుగులకు చేరింది. 312.50 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్ధ్యానికి ప్రస్తుత నీటి నిల్వ 290.51 టీఎంసీలుగా ఉంది.
సాగర్ గేట్లు ఎత్తడంతో నీళ్ల సౌందర్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఓపెన్ చేశామని నాగార్జునసాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com