Amrutha Pranay : ప్రణయ్ కేసులో తీర్పుపై అమృత స్పందన

సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం తీర్పుపై అమృత సోషల్ మీడియాలో స్పందించారు. 2018లో తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడికి మరణ శిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై అమృత ఇన్ స్టాలో స్పందించారు. ఈ కేసులో న్యాయం జరిగిందని, పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తన నిరీక్షణ ముగిసిందని, న్యాయం జరిగిందని.. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని రాసుకొచ్చారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అలాగే అతని మీడియా ముందు కనిపించలేనని, ప్రెస్ మీట్లు పెట్టలేనని అన్నారు. శ్రేయోభిలాషులందరూ తమ ప్రైవేసీని అర్థం చేసుకొని గౌరవించాలని అభ్యర్థించారు అమృత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com