Bandi Sanjay : ఆరు గ్యారంటీల ఊసే లేదు... బండి సంజయ్ ఫైర్

హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఊరగొండ రాజు కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘నేత కార్మికుల కరెంట్ బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మోసం చేశాయి. నేత కార్మికులకు 50శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి రెండు పార్టీలు మాట తప్పాయి. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారు. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తా. ‘ఎన్’ కన్వెన్షన్ను కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. పెద్దోళ్లను కొట్టి చిన్నోళ్లకు ఇవ్వాలి. తెలిసి తెలీక కొందరు ఇళ్లు కట్టుకున్నారు.. వాటిని కూల్చేస్తే ఎలా? జన్వాడ ఫామ్హౌస్ మీద డ్రోన్ ఎగరేసి జైలుకెళ్లిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సలకం చెరువులో కట్టిన కట్టడాలను ఎందుకు కూల్చడం లేదు. రైతు రుణమాఫీ రూ.47వేల కోట్లు చేస్తామని చెప్పి.. రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com