కరీంనగర్-హసనపర్తి రైల్వే లైన్ ఇవ్వండి.. కేంద్రానికి బండి సంజయ్ రిక్వెస్ట్

కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఢిల్లీలో మంగళవారం అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన బండి సంజయ్ లేఖను అందజేశారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్ కు రూ. 1415 కోట్లు వ్యయం అవు తుందని, డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.
రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్ లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు సంజయ్. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని
వెల్లడించారు. కరీంనగర్ - వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైల్వే మంత్రికి బండి సంజయ్ మరో లేఖ అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com