Prajaahita Yatra : నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) దగ్గర పడుతున్న వేళ బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) ప్రజాహిత యాత్రను చేపడుతున్నారు. ఇవాళ ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. తొలి విడుత యాత్ర ఈ నెల 15 వరకు జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున మూడు రోజుల చొప్పున పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు.
తొలిరోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో జరగనుంది. రాత్రి కథలాపూ ర్లో సంజయ్ బసచేస్తారు. తొలివిడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీ. మేరకు యాత్ర చేయనున్నారు.
ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ మండలం కవర్ చేస్తూ.. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం (Narendra Modi Government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఈ యాత్రలో జిల్లాకు సంబంధించిన నాయకులతోపాటు సంజయ్కుమార్కు మద్దతుగా పలువురు రాష్ట్ర నాయకులు హాజరయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గ్రామాల్లో కాలినడకన, బయటకు వచ్చాక వాహనంలో యాత్ర కొనసాగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
‘మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఈ మహాయాగంలో మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నా.. ఆశీర్వదించండి’అంటూ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యా త్రను విజయవంతం చేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com