Cherlapalli Terminus : 28న చర్లపల్లి టెర్మిన్ ప్రారంభం.. భారీ ఏర్పాట్లు.. వచ్చే అతిథులు వీరే

హైదరాబాద్ సిటీకి మరింత సౌకర్యాల వెలుగు అద్దేందుకు మరో అద్భుత ప్రయాణ సౌధం చేరనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. చర్లపల్లి టెర్మినల్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చర్లపల్లిలో రెండు ఎంఎంటీఎస్ ప్లాట్ఫాంలతో కలిపి 9 ప్లాట్ఫాంలు నిర్మించారు. 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏసీ, నాన్-ఏసీ గదులు, రిజర్వేషన్ కౌంటర్లు, ఇరువైపులా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి పరుగులు తీయనున్నాయి.
ప్రతిరోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని రైల్వేశాఖ అంచనావేసింది. ప్రస్తుతం ఇక్కడ 13 జతల రైళ్లు ఆగుతున్నాయి. వీటిలో ప్రధానంగా కాగజ్నగర్ ఇంటర్సిటీ, కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, మిర్యాలగూడ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ - వరంగల్ పుష్-పుల్ , శబరి ఎక్స్ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్ప్రెస్, లింగంపల్లి, ఘట్కేసర్ ఎంఎంటీఎస్, రేపల్లె ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 25 జతల రైళ్లు పరుగులు తీస్తే నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గతుందని రైల్వేశాఖ చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com