KCR: ఆగం కావొద్దు.. రాయేదో.. రత్నమేదో తెల్సుకోవాలే

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. హాలియా సభలో మాజీ మంత్రి జానారెడ్డిపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కృష్ణా జలాలను పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా దేశంలో రావాల్సిన ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రాలేదని కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని చెప్పారు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని, ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలని కేసీఆర్ సూచించారు. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కోరుతున్నానని, పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసి ఓటేయాలని సూచించారు. గతంలో ఇక్కడి నుంచి వేల మంది వలసపోయేవారని, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారని, పాలకుర్తి నియోజకవర్గంలో లక్షా 30వేల ఎకరాలకు సాగునీరిచ్చామని కేసీఆర్ అన్నారు.
రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే చెబుతున్నారని.. నాయకుల గోల్మాల్ మాటలు విని ఆగం కావొద్దని ప్రజలను ఆయన కోరారు. దేశాన్ని 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్తో మన బతుకులు మారాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి. అందరూ చెప్పే మాటలు విని ఆగం అయితే ఐదేళ్లపాటు కష్టాల పాలే అవుతామని కేసీఆర్ చెప్పారు. అందుకే ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి వేయాలని, అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లేలా చేయాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం మళ్లీ నిలబెట్టాలని కోరారు. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారని.. గతంలో జనారెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి ఓడగొట్టారని గుర్తు చేశారు. అదే తరహాలో నాగార్జున సాగర్లో నోముల భగత్ను 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
రైతు బంధు, 24 విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతుబంధు దుబారా అని, 24 గంటల విద్యుత్ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే చెబుతున్నారని.. వారి గోల్మాల్ మాటలు విని ఆగం కావొద్దని ప్రజలను కేసీఆర్ కోరారు. ఎన్నికలు పూర్తి కాగానే మార్చి నుంచి రేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యమే ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ధైర్యంగా పని చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే పని చేయలేదని కేసీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు.. ఓటు. ఇది ఎలాపడితే అలా వేసేది కాదని, నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని పిలుపునిచ్చారు. రేపు బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో KCR ప్రచారం చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com