CM Revanth : మంత్రులకు సీఎం రేవంత్ డిన్నర్ పార్టీ.. అసలు అజెండా ఇదే!

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, త్వరలోనే జరగనున్న కేబినెట్ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపిక తదితర కీలక పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో కొంతమందికి మాత్రమే అవకాశం ఉండడంతో విస్తరణ తర్వాత నెలకొనబోయే పరిణామాలను గురించి చర్చించారు. సమన్వయ లోపాలపై అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు బుధవారం రాత్రి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసి అత్యవసరంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ జరిగితే ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా జూన్ మొదటి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీకాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల ప్రకటించారు. దీంతో.. నేతలందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగా డిన్నర్ పార్టీ ఏర్పాటుచేసినట్టు వినికిడి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com