TG : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు . సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షీ ఉన్నారు. నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటికానున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో వరంగల్ లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున.. ఢిల్లీ పర్యటనలో రాహుల్ ను కలిసి ఆహ్వానించనున్నారు.
కేంద్ర మంత్రులను కలుస్తూ..
ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కలిశారు. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే పథకంలో వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. ఇతర శాఖల మంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com